రివ్యూ: ‘వ్యూహం’

Movie Review-
రివ్యూ: ‘వ్యూహం’

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కాంట్రవర్సల్ మూవీ ‘వ్యూహం’ ఎట్టుకేలకు అన్ని అడ్డంకులను తప్పించుకుని విడుదైలంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని బేస్ చేసుకోవడంతో పాటు ఆయన రాజకీయ ప్రత్యర్థులైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పోలిన పాత్రలు కూడా ఇందులో ఉండటం, అందులోనూ ఎన్నికల సీజన్లో ఈ చిత్రం రావడంతో వర్మ ఇందులో ఏం చూపించారు అనేది ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ చిత్రం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? అనేది రివ్యూలో చూద్దాం.

కథ:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భారత్ పార్టీ నేత వీఎస్ వీర శంకర్ రెడ్డి(వైఎస్ఆర్) హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన ఘటనతో సినిమా మొదలవుతుంది. పార్టీలో ఉన్న 150 మంది ఎంఎల్ఏలు ఆయన వారసుడు మదన్మోహన్ రెడ్డి(అజ్మల్ అమీర్) సీఎం అయితేనే న్యాయం జరుగుతుందని ఒక లేఖను భారత్ పార్టీ అధినేత్రి మేడం దగ్గరకు పంపుతారు. అయితే అతడిని సీఎం చేయడానికి హైకమాండ్ ఒప్పుకోదు. ఆ తర్వాత తన తండ్రి మరణం తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు మదన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర ప్లాన్ చేయగా దానికి కూడా హైకమాండ్ అడ్డు పడటంతో పాటు అక్రమ ఆస్తుల కేసుల్లో అతడు అరెస్ట్ అయ్యేలా చేస్తుంది. దీంతో పార్టీకి రాజీనామా చేసిన మదన్మోహన్ రెడ్డి వీఎస్ఆర్ సీపీ పార్టీని స్థాపిస్తాడు.

ఎలాంటి పరిస్థితుల్లో మదన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ స్థాపించాడు? పార్టీ స్థాపించిన తర్వాత అతడి ఎదుగుదలను అడ్డుకునేందుకు ఇంద్రబాబు (ధనుంజయ్ ప్రభు) ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత మదన్మోహన్ రెడ్డికి అతడి భార్య వీఎస్ మాలతి రెడ్డి(మానస రాధాకృష్ణ) ఏ విధంగా తోడ్పాటును అందించింది? ఏపీ రాజకీయాల్లో శ్రవణ్ కుమార్ ఎలాంటి పాత్ర పోషించాడు? తండ్రి మరణం నుంచి సీఎం అయ్యే వరకు మదన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న అడ్డంకులు ఏమిటి? అనేది సినిమా కథలోని ప్రధాన అంశాలు.

సినిమా ఎలా ఉంది అంటే?

సినిమా ప్రారంభంలో ఈ చిత్రంలోని పాత్రలు ఎవరినీ ఉద్దేశించినవి కాదు అనే కార్డు వేస్తారు. కానీ ఇది ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి తీసిందే అనేది బహిరంగ రహస్యం. అయితే ఇందులో జనాలకు తెలియని ఏదో కోణం సినిమాలో చూపిస్తారని అంతా భావించారు. కానీ అలాంటి అంశాలు ఏమీ లేకుండా చప్పగా ముందుకు నడిపించాడు దర్శకుడు.

తెలిసిన విషయాలు అయినప్పటికీ కథనంతో ఆసక్తిగా సినిమాలు మలచడంలోనే దర్శకుడి పనితనం ఉంటుంది. కానీ రాంగోపాల్ వర్మ కథనం విషయంలో పెద్దగా ఫోకస్ పెట్టినట్లు అనిపించలేదు. దీంతో మొదటి భాగం సాదాసీదాగా సాగుతుంది. ఊహాజనిత అంశాలతో సెకండాఫ్ లో కూడా పెద్దగా విషయం ఉన్నట్లు అనిపించదు. వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే ఇంద్రబాబు సంబరపడినట్లు చూపించడం లాంటి కాంట్రవర్సీలు ఇందులో జొప్పించే ప్రయత్నంచేశాడు. మరో వైపు శ్రవణ్ కళ్యాణ్ పాత్రను చాలా కామెడీగా చూపించాడు. ఇది తప్పకుండా రాష్ట్రంలో ఒక పార్టీ అధినేతగా ఉన్న పవర్ స్టార్ అభిమానులను హర్ట్ చేస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాత్రను తన గురించి తాను ఓవర్ గా ఊహించుకునే వెర్రిబాగులోడిగా చూపించారు. పప్పు పాత్రను చూపించకుండానే ఆ పాత్రపై కామెడీ పండించే ప్రయత్నం చేశారు. ఎలాంటి సెన్సేషనల్ అంశాలు లేకుండా సాదా సీదాగా సినిమాను ముగించాడు.

పెర్ఫార్మెన్స్:

మదన్మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్ అమీర్ ఒదిగిపోయాడు. అతడి బాడీ లాంగ్వేజ్ ఏపీ సీఎం జగన్ గుర్తొచ్చేలా చేస్తుంది. ఇంద్రబాబు పాత్రలో ధనుంజయ్ లెక్స్ పర్ఫెక్టుగా సూటయింది. అతడి నటన కూడా ఆకట్టుకుంటుంది. వీఎస్ మాలతి పాత్రలో మానస రాధాకృష్ణన్ తన అందం, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇతర నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశాడు.

టెక్నకల్ విభాగాలు:

సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫి ఓకే. సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు ఫర్వాలేదనే విధంగా ఉన్నాయి

ఫైనల్ గా....

ఈ చిత్రంలో శ్రవణ్ కళ్యాణ్ పాత్ర డిజైన్ చేసిన విధానం చూసి ఒక వర్గం వారు నవ్వుకోడానికి తప్ప కొత్త విషయాలు ఏమీ లేవు.

దర్శకుడు: రామ్ గోపాల్ వర్మ

నిర్మాత: రామదూత క్రియేషన్స్, ఆర్జీవీ ఆర్వీ గ్రూప్

సంగీతం: ఆనంద్

నటీనటులు: అజ్మల్ అమీర్, మానస రాధా కృష్ణన్, ధనుంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, వాసు ఇంటూరి, కోట జయరాం తదితరులు