నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో చందు మొండేటి మూవీ అనగానే అంచనాలు పెరిగాయి. పైగా సినిమా విడుదల సమయంలో యూనిట్ సభ్యులు చేసిన ప్రమోషన్స్ హంగామాతో అంచనాలు మరింతగా పెరిగాయి. నాగ చైతన్య కెరీర్లో బెస్ట్ మూవీ అంటూ అల్లు అరవింద్ మొదటి నుంచి చెబుతూ వచ్చారు. సాయి పల్లవికి ఉన్న క్రేజ్ నేపథ్యంలో పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను విడుదల చేశారు. భారీ అంచనాలను మోస్తున్న ఈ సినిమా ఫలితం ఏంటి అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
తన కోసం కాకుండా తన చుట్టూ ఉన్న వారి కోసం నిలబడే వ్యక్తి రాజు(నాగ చైతన్య). ఒక గొడవలో ఊరుకోసం నిలబడి తండేల్(లీడర్)గా మారతాడు. చిన్నప్పటి నుంచి రాజు, సత్య/బుజ్జితల్లి(సాయి పల్లవి) ఇష్టపడుతూ ఉంటారు. రాజు ఇంకా అతడి టీం 9 నెలలు సముద్రంలో వేటకు వెళ్లి 3 నెలలు ఇంటికి వస్తూ ఉంటారు. ఆ మూడు నెలలు రాజు, సత్య చాలా సంతోషంగా ఉంటారు. చేపల వేటకి వెళ్లిన వారు ప్రమాదం బారిన పడుతారనే భయంతో సత్య ఒకసారి రాజును వెళ్లవద్దని అంటుంది. అయినా రాజు వెళ్తాడు. దాంతో రాజుపై సత్య కోపంతో ఉండి మాట్లాడదు.
అలా వెళ్లిన రాజు, అతడి తోటి వారు సముద్రంలో తుఫాన్ కారణంగా అనుకోని పరిస్థితుల్లో పాకిస్తాన్ హద్దుల్లోకి వెళ్తారు. అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి చిక్కి జైల్లో పడతారు. మరో వైపు రాజుపై కోపంతో సత్య మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధం అవుతుంది. పాకిస్తాన్ జైల్లో ఏం జరిగింది? రాజు, అతడి టీం మెంబర్స్ని సత్య కాపాడేందుకు ఏం ప్రయత్నాలు చేసింది? అనేది కథాంశం.
నటీనటుల నటన :
తండేల్ రాజు పాత్రలో నాగ చైతన్య నటన బాగుంది. లుక్తోనూ మెప్పించాడు. యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. లవ్, ఎమోషనల్ సన్నివేశాల్లోనూ నాగ చైతన్య ఈసారి అంతకు మించి అన్నట్లుగా తన నటనతో మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక సాయి పల్లవితో డాన్స్ అంటే నాగ చైతన్య ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే నాగ చైతన్య డాన్స్ కోసం బాగానే కష్టపడ్డాడు. సెకండ్ హాఫ్ లో నాగ చైతన్య జైల్లో కనబర్చిన నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక ప్రేమికుడిగా నాగ చైతన్య చక్కని ఎమోషన్స్ కనబర్చారు.
సత్య పాత్రలో సాయి పల్లవి నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సాధారణంగానే సాయి పల్లవి లుక్ చాలా సింపుల్గా నేచురల్గా ఉంటుంది. ఇలాంటి పాత్రలకు ఇంకా నేచురల్గా ఆమె కనిపించగలదని మరో సారి నిరూపితం అయ్యింది. లుక్తో పాటు ఆమె నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎమోషనల్ సన్నివేశాల్లో సాయి పల్లవి నటన ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించే విధంగా ఉంది. కొన్ని స్కోప్ లేని సీన్స్లోనూ సాయి పల్లవి చక్కని నటనతో ఆకట్టుకుంది. ఇతరుల గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదు. ఎవరి పాత్రల్లో వారు పర్వాలేదు అనిపించారు.
టెక్నికల్ :
సినిమాలో ప్రధాన ఆకర్షణ సంగీతం. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. సినిమాలోని మూడు సాంగ్స్తో మెప్పించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాల స్థాయిని మరింతగా పెంచాడు అనడంలో సందేహం లేదు. ప్రతి సీన్లోనూ వావ్ అనిపించేలా సంగీతం మెప్పించింది. సినిమాటోగ్రఫీ బాగుంంది. కొన్ని సన్నివేశాలను నేచురల్గా చూపించడంలో సినిమాటోగ్రఫీ బాగా హెల్ఫ అయ్యింది. సముద్రపు అందాలను సహజసిద్దంగా చూపించారు.
దర్శకుడు చందు మొండేటి సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ బాగున్నా.. సెకండ్ హాఫ్లోని సన్నివేశాలు సాగతీసినట్లు ఉన్నాయి. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.
విశ్లేషణ :
తండేల్ ప్రమోషన్స్ సమయంలో పాకిస్తాన్కి సంబంధించిన సన్నివేశాలు 20 నిమిషాల కంటే ఎక్కువ ఉండవని దర్శకుడు చందు మొండేటి అన్నారు. కానీ సినిమాలోని సెకండ్ హాఫ్లో దాదాపు పూర్తిగా అవే సీన్స్ ఉన్నాయి. సినిమా మొదటి సంగం సాఫీగా ప్రేమ కథతో సాగింది. కానీ సెకండ్ హాఫ్లోని పాకిస్తాన్ జైలు సన్నివేశాలు, బలవంతంగా దేశ భక్తి సన్నివేశాలను జొప్పించినట్లు ఉంది.
హీరోను ఎలివేట్ చేయడం కోసం పాకిస్తాన్ జైల్లో చేసిన హంగామా నేచురాలిటీకి దూరంగా ఉంది. పాకిస్తాన్ జైల్లో ఉండే సన్నివేశాలు అన్ని కూడా సహజ సిద్దంగా లేవు. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ఉండే లవ్ ట్రాక్ బాగుంది, దాన్ని సెకండ్ హాఫ్లో ఇంకాస్త భిన్నంగా చూపించి ఉంటే బాగుండేదేమో. మొదటి సగంలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనిపించినా సెకండ్ హాఫ్ బోరింగ్ సన్నివేశాలతో నీరసం తెప్పించారు. దర్శకుడు చందు మొండేటి సెకండ్ హాఫ్ విషయంలో ఇంకాస్త విభిన్నంగా ఆలోచించి ఉంటే బాగుండేది. ఓవరాల్గా సినిమా ఒకసారి చూడవచ్చు అన్నట్లు ఉంది.
ప్లస్ పాయింట్స్ :
నాగ చైతన్య, సాయి పల్లవి,
లవ్ సీన్స్,
ఎమోషనల్ సీన్స్,
సంగీతం,
మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్,
డ్రాగ్ చేసినట్లు కొన్ని సన్నివేశాలు,
పాకిస్తాన్ ఎపిసోడ్
చివరగా...
మొదటి సగం ఫీల్ గుడ్ లవ్ స్టోరీ... సెకండ్ హాఫ్ రొటీన్ దేశభక్తి
బ్యానర్ : గీతా ఆర్ట్స్
నిర్మాత : బన్నీ వాసు
సమర్పణ : అల్లు అరవింద్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
దర్శకత్వం : చందు మొండేటి
తారాగణం : నాగ చైతన్య, సాయి పల్లవి, దివ్య పిళ్లై, మహేష్, ప్రకాష్ బెలవాడి, కళ్యాణి నటరాజన్, పృథ్వీ తదితరులు