అల్లు అర్జున్, సుకుమార్ అండ్ టీమ్ పుష్ప 2 కోసం దాదాపు 3 ఏళ్ళు కష్టపడ్డారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సాంగ్స్ ఇప్పటికే హిట్ అయ్యాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. సినిమా విడుదలకు ముందే దాదాపు వెయ్యి కోట్ల వసూళ్లు పక్కా అనే స్థాయిలో బిజినెస్ జరిగింది. అభిమానుల అంచనాలను ఈ సినిమా అందుకుందా? అనేది రివ్యూలో చూద్దాం.
కథ:
పుష్పరాజ్- భన్వర్ సింగ్ షెకావత్ మధ్య వైరం మొదలవ్వడంతో మొదటి పార్ట్ ఎండ్ అవుతుంది. రెండో పార్టులో పుష్ప రాజ్ రూల్ ఎలా సాగించాడు, తనను మళ్లీ కూలీగా మారుస్తానని ఛాలెంజ్ విసిరిన షెకావత్(పహాద్ ఫాజిల్)కు పుష్ప రాజ్ ఎలా సమాధానం చెప్పాడు అనే అంశాలను హైలెట్ చేస్తూ కథ సాగుతుంది. పుష్ప తన తెలివి తేటలతో ఎర్ర చందనం స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని ఇంటర్నేషనల్ స్థాయికి విస్తరిస్తాడు. పుష్ప పవర్ ఏ స్థాయికి వెళుతుందంటే.... తనలాంటి స్మగ్లర్ తో ఫోటో దిగడానికి ముఖ్యమంత్రి ఇష్ట పడక పోతే.... ఏకంగా సీఎంనే మార్చే స్థాయికి పుష్ప ఎదుగుతాడు.
ఈ దందాలో ఇంత సక్సెస్ సాధించినా చిన్నతనం నుంచి నాన్న ఎవరో చెప్పుకోలేక, ఇంటి పేరు లేక అవమానాలు పడుతూ పెరిగిన బాధ పుష్పలో అలానే ఉండి పోతోంది. తనకు కొడుకు పుడితే వాడికి ఇంటి పేరు ఇవ్వలేను అనే బాధతో ఆడ పిల్ల పుట్టాలని కోరుకుంటాడు. మరి ఆ పరిస్థితుల్లో పుష్పకు ఎదురైన సంఘటనలు ఏమిటి? పుష్పను అంతం చేయాలని చూసిన షెకావత్, మంగళం శ్రీను(సునీల్) ఏం చేశారు అనేది తర్వాతి కథ.
సినిమా ఎలా ఉందంటే...
జపాన్ లోని యోకొహమా పోర్ట్ లో కథ ప్రారంభం అవుతుంది... కంటైనర్లో చందనం దుంగలతో పాటు 40 రోజులు ప్రయాణించి ఫుష్ప ఇక్కడికి చేరుకుంటాడు. ఇక్కడ ఫైట్ సీక్వెన్స్ తో హీరో ఎంట్రీ ఇస్తాడు... అయితే జపాన్ లో సినిమా ఎందుకు మొదలైంది అని ప్రేక్షకులు ఆలోచించేలోపే కథను ఉన్నట్టుండి మళ్లీ శేషాచలం అడవుల్లోకి టర్న్ అవుతుంది.
పుష్ప ఇంటర్నేషనల్ స్థాయిలో భారీ డీల్ కుదుర్చుకుని 2 వేల టన్నుల సరుకు దేశం దాటించడానికి ప్లాన్ చేస్తాడు. దీనికి షెకావత్ అడ్డు పడటం, పుష్ప అతడికి దొరక్కుండా సరుకు దేశం దాటిస్తానని చాలెంజ్ చేయడం, షెకావత్ ను వెర్రి పుష్పం చేసి విజయవంతంగా సరుకు దాటించడం లాంటి ట్విస్టులతో ఇంటర్వెల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సెకాండాఫ్ లో కుటుంబ పరంగా పుష్పకు ఎదురైన సమస్యలు ఏమిటి? చిన్న తనం నుంచి తనను బయటి వ్యక్తిగా చూసిన, తనను ముల్లేటి వెంకట రమణ కొడుకుగా అంగీకరించని కుటుంబం కోసం పుష్ప ఏం చేశాడు? చివరకు కుటుంబానికి ఎలా దగ్గరయ్యాడు అనే అంశాలతో సినిమా క్లైమాక్స్ చేరుకుంటుంది.
హైలెట్స్ ఇవే...
జాతర లో ఆడ వేషం కట్టి పుష్ప చేసే ఫైట్ సీన్ అదిరిపోయింది. ఈ సీక్వెన్స్ తర్వాత రష్మిక చెప్పే నాన్ స్టాప్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ లో తన అన్న కూతురిని కాపాడే క్రమంలో అల్లు అర్జున్ ఫైట్ సీన్ అద్భుతంగా ఉంటుంది. దీంతో పాటు కుటుంబానికి సంబంధించిన సీన్లలో గుండెలకు హత్తుకునేలా సెంటిమెంట్ సీన్లు మరో హైలెట్.
ఎవరు ఎలా చేశారంటే...
అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్. ఆడ వేషంలో, పుష్ప రాజ్ సిండికేట్ మీద డామినేషన్ ప్రదర్శించే సీన్లలో, యాక్షన్ సీక్వెన్స్ లో బన్నీ తన విశ్వరూపం చూపించాడు. రష్మికకు పార్ట్ 2లో మంచి సీన్లు పడ్డాయి. అల్లు అర్జున్ తో పోటీ పడి నటించింది. ముఖ్యంగా తన భర్త గొప్పతనం గురించి చెప్పే సీక్వెన్స్ హైలెట్. ఇక ఈ ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్లు కూడా ఆకట్టుకుంటాయి. విలన్ గా పహాద్ ఫాజిల్ నటన బావుంది. సిండికేట్ ను నడిపించే పెద్ద మనిషిగా, ఎంపీగా, సీఎంగా రావు రమేశ్ తన పాత్రకు న్యాయం చేశారు. ఢిల్లీలో పెద్ద తలకాయ పాత్రలో జగపతి బాబు కనిపించాడు. ఇందులో ఆయనకు తక్కువ సీన్లే పడ్డాయి కానీ... రాబోయే పార్ట్ 3లో మెయిన్ విలన్ జగపతి బాబే.
టెక్నికల్ అంశాలు...
దర్శకుడు సుకుమార్ మరోసారి తన డైరెక్షన్ స్థాయి ఏ రేంజిలో ఉంటుందో నిరూపించాడు. అల్లు అర్జున్ అభిమానులు ఏం కోరుకుంటున్నారో ఆ కంటెంట్ ఇవ్వడంతో పాటు కథ విషయంలో, భావోద్వేగాల విషయంలో, స్క్రీన్ ప్లే విషయంలో తనదైన మార్క్ చూపిస్తూ అద్భుతంగా సినిమాను నడిపించాడు. దేవిశ్రీ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరో హైలెట్. బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బావున్నాయి. ఫైట్ సీక్వెన్స్ డిజైన్ చేసిన విధానం మరో హైలెట్ అని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్:
-అల్లు అర్జున్, పహాద్ ఫాజిల్, రష్మిక పెర్పార్మెన్స్
-సుకుమార్ డైరెక్షన్
-భావోద్వేగానికి గురిచేసే సీన్లు
-దేవిశ్రీ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
-కథలో సంఘర్షణ మిస్ అవ్వడం
-పుష్ప డామినేషనే తప్ప విలనిజం పవర్ ఫుల్ గా లేక పోవడం
చివరగా....
పుష్ప రాజ్ బాక్సాఫీసును రూల్ చేయడం ఖాయం...
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
దర్శకుడు: సుకుమార్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
తారాగణం : అల్లు అర్జున్, రష్మిక మందన, జగపతి బాబు, ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ భండారి, శ్రీ తేజ, అనసూయ భరద్వాజ్, సునీల్, తదితరులు