2022లో వచ్చిన 'ఓదెల రైల్వే స్టేషన్' మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఓటీటీ ద్వారా వచ్చిన ఆ సినిమాను ఎక్కువ శాతం మంది థియేట్రికల్ రిలీజ్ అయితే బాగుండేది కదా అనే అభిప్రాయంను వ్యక్తం చేశారు. ఆ సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ నేపథ్యంలో సీక్వెల్ను ప్లాన్ చేశారు.
సంపత్ నంది సమర్పించిన ఈ సినిమాకు మొదటి నుంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. తమన్నా అఘోరి పాత్రలో నటించిందనే వార్తలు రావడంతో అంచనాలు పెరిగాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
'ఓదెల రైల్వే స్టేషన్' కథ ఎక్కడైతే పూర్తి అయిందో అక్కడ నుంచి ఈ సినిమా కథ ప్రారంభం అవుతుంది. ఓదెల గ్రామంలో శోభనం రోజు రాత్రి అమ్మాయిలు మాయం కావడం, ఆ తర్వాత మరణించడం జరుగుతూ ఉంటుంది. అందుకు కారణం అయిన తిరుపతి(వశిష్ట సింహా)ని అతడి భార్య చంపేస్తుంది. తిరుపతి చనిపోయిన తర్వాత కూడా ఓదెల గ్రామాన్ని వదిలి పెట్టాడు. ప్రేతాత్మ రూపంలో మారి తన కామంను ప్రదర్శిస్తూ మరింత రాక్షసంగా గ్రామంలో హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ ఉంటాడు.
ఆ ప్రేతాత్మకను అడ్డుకునే సత్తా కేవలం భైరవి(తమన్నా)కి మాత్రమే ఉంటుంది. ఇంతకు భైరవి ఎవరు? చివరకు తిరుపతి ఆత్మను ఎలా శాంతింపజేశారు? అనేది కథాంశం.
నటీనటుల నటన :
ఇన్నాళ్లు గ్లామర్ రోల్స్లో కనిపించిన మిల్కీ బ్యూటీ తమన్నా లేడీ ఓరియంటెడ్ సినిమాను చేయడం, అది కాకుండా అఘోరి గా కనిపించడం అనేది చాలా పెద్ద సాహసం. ఆమె అలాంటి గెటప్లో చూపిస్తే ప్రేక్షకులు చూస్తారా అనే అనుమానం లేకుండా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా పెద్ద విషయం. మేకర్స్ విశ్వాసంను నిలబెట్టే విధంగా తమన్నా తన నటనతో మెప్పించింది. కానీ భైరవి పాత్రను ఇంకాస్త స్ట్రాంగ్గా చూపించి ఉంటే ఫలితం మరోలా ఉండేది.
మొదటి పార్ట్లో తన నటనతో మెప్పించిన వశిష్ట సింహా ఈ సినిమాలో పెద్దగా కనిపించలేదు. కానీ ఆయన భీకరమైన డైలాగ్స్ కొన్ని సార్లు వెన్నులో వనుకు పుట్టించాయి. ముఖ్యంగా హర్రర్ సన్నివేశాల్లో వశిష్ట డైలాగ్స్తో పాటు అప్పియరెన్స్ షాకింగ్గా ఉంది. హెబ్బా పటేల్ కనిపించినప్పటికీ పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. సినిమా మొత్తం కూడా తమన్నా పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆమె నటన బాగానే ఉన్నప్పటికీ ఆ పాత్రను చూపించిన తీరు బాగాలేదు.
టెక్నికల్ :
ఈ సినిమాకు షాడో దర్శకుడిగా సంపత్ నంది వ్యవహరించినట్లుగా కొన్ని సన్నివేశాలను చూస్తే అర్థం అవుతుంది. పేరుకు దర్శకుడు అశోక్ తేజ అయినప్పటికీ ఆయన యొక్క మార్క్ కంటే సంపత్ నంది మార్క్ ఎక్కువగా కనిపించింది. దర్శకత్వం ఎవరిది అయినా మంచి కాన్సెప్ట్ పట్టుకున్న మేకర్స్ దాన్ని సరైన రీతిలో ప్రజెంట్ చేయలేక పోయారు. ముఖ్యంగా సన్నివేశాల్లో బలం లేదు, పలు సన్నివేశాలను ముందుగానే ఊహించవచ్చు. వెండి తెరపై కథను ఇంకాస్త స్ట్రాంగ్గా చెప్తేనే ప్రేక్షకులు ఒప్పుకుంటారు. ఈ సినిమాకు అజనీష్ అందించిన బీజీఎం ఆకట్టుకుంది. పలు సన్నివేశాల స్థాయిని అతడి బీజీఎం పెంచింది అనడంలో సందేహం లేదు.
సినిమాలోని వీఎఫ్ఎక్స్ వర్క్ బాగుంది. ముఖ్యంగా తిరుపతి ఆత్మను చూపించాలని భావించినప్పుడు తీసుకున్న గ్రాఫిక్ వర్క్ బాగుంది. ఎన్నో హర్రర్ సినిమాలు చూసి ఉంటాం. కానీ ఈ సినిమాలోని హర్రర్ సీన్స్ విభిన్నంగా ఉన్నాయి అనడంలో సందేహం లేదు. కథ, స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. దర్శకుడు కథనంతో గందరగోళం సృష్టించాడు. ఎడిటింగ్లో లోపాలు ఉన్నాయి. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. పలు సన్నివేశాలను నేచురల్గా చూపించారు.
ప్లస్ పాయింట్స్ :
తమన్నా,
వీఎఫ్ఎక్స్,
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
కథ, కథనం,
దర్శకత్వం,
పాత్రలకు ప్రాముఖ్యత లేకపోవడం,
దెయ్యం, దైవం సన్నివేశాల్లో డెప్త్ లేకపోవడం.
విశ్లేషణ :
సాదారణంగా సీక్వెల్స్ అంటే మొదటి పార్ట్తో సరైన కనెక్షన్ క్రియేట్ చేయడంలో మేకర్స్ విఫలం అవుతారు. కానీ దర్శకుడు అశోక్ తేజ మొదటి పార్ట్ కథ ఎక్కడ పూర్తి అయిందో అక్కడ నుంచి మొదలు పెట్టి కనెక్ట్ చేయడంలో సఫలం అయ్యాడు. ఇప్పటి వరకు ఎన్నో ప్రేతాత్మ కథలు వచ్చాయి. దెయ్యంతో దైవం యుద్దం కాన్సెప్ట్తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే స్క్రీన్ ప్లే విభిన్నంగా ఉన్న సినిమాలన్నీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.
తమన్నా పాత్రను ఇంకాస్త స్ట్రాంగ్గా చూపించడంతో పాటు, దెయ్యం, దెయ్యం కాన్సెప్ట్ను ఇంకాస్త లోతుగా చూపించగలిగి ఉంటే కచ్చితంగా సినిమా మరో లెవల్లో ఉండేది. హర్రర్ సినిమాలను ఇష్టపడే వారి సంతృప్తి చెందే విధంగా దెయ్యం సీన్స్ను డిజైన్ చేయలేక పోయారు.
రెండో పార్ట్ భారంగా ఉందంటే మూడో పార్ట్ కోసం కథను మిగల్చడం మరింతగా విడ్డూరంగా ఉంది. శివ శక్తిని దెయ్యం కామించడం అనేది కాస్త ఎబెట్టుగా అనిపించింది. లాజిక్ లేని సీన్స్తో పాటు, మెయిన్ స్టోరీ లైన్ను దెబ్బ తీసే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. కథ, కథనం విషయంలో విఫలం అయ్యారు. పబ్లిసిటీ చేసిన స్థాయిలో కంటెంట్ లేదని చెప్పక తప్పదు.
చివరగా...
వీక్ కథ, కథనంతో బోర్ కొట్టించే 'ఓదెల 2'
బ్యానర్ : మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్
నిర్మాత : మధు, సంపత్ నంది
దర్శకత్వం : అశోక్ తేజ
సంగీతం : అజనీష్ లోక్నాథ్
తారాగణం : తమన్నా, వశిష్ట సింహా, హెబ్బా పటేల్, శ్రీకాంత్ అయ్యర్, మురళి శర్మ తదితరులు