చిన్న సినిమాగా రూపొంది పాన్ ఇండియా రేంజ్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'కాంతార' సినిమాకు ప్రీక్వెల్గా ఈ సినిమాను రూపొందించారు. సాధారణంగా సీక్వెల్ అంటే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. కానీ కాంతారకు ప్రీక్వెల్ అన్నా కూడా ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కారణంగా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి పార్ట్ ను చిన్న బడ్జెట్తో తీస్తే ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ ప్రీక్వెల్ ప్రేక్షకులను ఆకట్టుకుందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
ఈ కథ మొత్తం కాంతార ప్రాంతం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మొదటి పార్ట్ ఎక్కడైతే ముగిసిందో అక్కడే ఈ ప్రీక్వెల్ను ప్రారంభించారు. పంజుర్లి జాతర తర్వాత మాయం అయిన తన తండ్రి గురించి తెలుసుకునేందుకు శివ ప్రయత్నిస్తున్న సమయంలో ఆ ప్రాంతం గురించి పెద్ద చరిత్ర తెలుస్తుంది. అదే ఈ కాంతార ఏ లెజెండ్ కథ. రాజశేఖర్ అనే రాజు పరిపాలిస్తున్న రాజ్యంలో కాంతార ప్రాంతం ఉంటుంది. అయితే ఆ ప్రాంతంలోకి రాజుకు, రాజు సైన్యంకు వెళ్లేందుకు అనుమతి ఉండదు. ఎవరైనా కాంతార ప్రాంతంకు వెళ్లాలి అనుకున్న, ఆ ప్రాంతాన్ని స్వాదీనం చేసుకోవాలి అనుకున్న చనిపోవడం జరుగుతుంది.
కాంతార ప్రాంతాన్ని బెర్మి(రిషబ్ శెట్టి) పరిరక్షిస్తూ ఉంటాడు. తన ప్రాంతంలో ఉండే ఖరీదైన సుగంధాలను రాజ్యంలో అమ్మి వ్యాపారం చేయాలి అనుకుంటాడు. ఆ క్రమంలో రాకుమారి కనకావతి(రుక్మిణి వసంత్)ని కలుస్తాడు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో యువరాజు కులశేఖర(గుల్షన్ దేవయ్య) కాంతార ప్రాంతాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? కులశేఖర, బెర్మిల మధ్య జరిగే యుద్దం ఎలాంటిది? రాజకుమారి కనకావతి పాత్ర ఏంటి? అనే విషయాలు తెలుసుకునేందుకు సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన :
సినిమాలో ఎంతో మంది నటీనటులు ఉంటారు. వారిలో చాలా మందికి కీలక పాత్రలు లభించాయి. అయితే బెర్మి పాత్రలో కనిపించిన రిషబ్ శెట్టి మొత్తం కథను తన బుజాలపై వేసుకుని నడిపించాడు అనిపించింది. ఆయన మొదటి పార్ట్లో అద్భుతంగా నటించాడు అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. కనుక ఇప్పుడు అంతకు మించి అనిపించుకునేందుకు రిషబ్ ఎంతగా కష్టపడ్డాడో క్లీయర్గా వెండి తెరపై కనిపిస్తోంది. ఆయన యాక్షన్ సీన్స్ మొదలుకుని, కొన్ని రొమాంటిక్ సీన్స్, దైవత్వంతో కూడిన సీన్స్ ఇలా అన్నింటిలోనూ రిషబ్ శెట్టి నటనతో మెప్పించాడు. అద్భుతమైన నటనతో ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రిషబ్ శెట్టి మరోసారి కాంతార వరల్డ్లోకి తీసుకు వెళ్లాడు.
హీరోయిన్గా నటించిన రుక్మిణి వసంత్ కు ఇంటర్వెల్కు ముందు వరకు పెద్దగా నటనకు స్కోప్ లేదు. కానీ సెకండ్ హాఫ్ లో ఆమె తన నట విశ్వరూపం చూపించే విధంగా నటించింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. రాజు పాత్రలో నటించిన జయరామ్ ఆకట్టుకున్నాడు. హుందాగా చాలా సెన్సిబుల్ నటనతో మెప్పించాడు. ఇక ఆయన కొడుకు పాత్రలో గుల్షన్ దేవయ సృష్టించిన విద్వంసం అంతా ఇంతా కాదు. సాధారణంగానే ఆయన విలనిజం బాగుంటుంది అంటూ విమర్శకులు సైతం ప్రశంసిస్తూ ఉంటారు. అలాంటి పాత్రను అంతకు మించి అన్నట్లుగా పోషించి ఆకట్టుకున్నాడు. సినిమాలో నటించిన ఇతర నటీనటులు సైతం వారి పాత్రల పరిధిలో చక్కని నటనతో ఆకట్టుకున్నారు.
టెక్నికల్ :
ఈ సినిమాలో కథ, స్క్రీన్ ప్లే కంటే టెక్నికల్ అంశాలకు ప్రధాన పీట వేసినట్లుగా ఉంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉండటంతో సినిమా విజువల్ వండర్ గా మారింది. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో వీఎఫ్ఎక్స్ విషయంలో చాలా సినిమాలు విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. కానీ ఈ సినిమా మాత్రం అందుకు భిన్నం అన్నట్లుగా నిలిచింది.
సినిమాలో వీఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతంగా ఉన్నాయి. సినిమాలో ఆవిష్కరించిన కొత్త లోకంను కళ్ల ముందు వీఎఫ్ఎక్స్ తో అద్భుతంగా తీసుకు వచ్చి పెట్టడంలో అన్ని డిపార్ట్మెంట్స్ సక్సెస్ అయ్యాయి. దర్శకుడు కథ విషయంలోనే ఇంకాస్త వర్కౌట్ చేయాల్సి ఉంది. స్క్రీన్ ప్లేతో పాటు కొన్ని చోట్ల డైలాగ్స్ విషయంలో జాగ్రత్తను తీసుకోవాల్సింది. ఎడిటింగ్ లో చిన్న చిన్న లోపాలు మినహా పెద్దగా చెప్పుకునే తప్పులు ఏమీ లేవు. సినిమాను భారీ బడ్జెట్తో అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మించారు.
విశ్లేషణ :
కాంతార ప్రీక్వెల్ అనగానే కేవలం కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాకుండా మొత్తం పాన్ ఇండియా ప్రేక్షకులు ఊగిపోయే పరిస్థితి ఉంది. అందుకే దర్శకుడు రిషబ్ శెట్టి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఏళ్ల పాటు కష్టపడి ఈ సినిమాను రూపొందించడంతో పాటు నటించాడు. నటుడిగా నూటికి నూరు శాతం సక్సెస్ అయిన రిషబ్ శెట్టి దర్శకుడిగా మాత్రం కాస్త వెనక పడ్డాడు అనిపించింది. ఎందుకంటే కథ ఎంపిక విషయంలో ఆయన చాలా ఎక్కువ రీసెర్చ్ చేసినట్లుగా అనిపించింది. విన్న కథలు, ఉన్న పుకార్లు అన్నింటిని ఆయన ఇక్కడ చెప్పేందుకు చాలా ప్రయత్నించాడు.
సినిమా కథలో పాత కథలు ఎక్కువ అయ్యాయి. అంతే కాకుండా రియాల్టీకి చాలా దూరంగా వెళ్లి పోయింది. మొదటి పార్ట్తో పోల్చితే సినిమా ప్రొడక్షన్ వాల్యూస్, ఇతర సాంకేతిక పరిజ్ఞానం నూరు శాతం మెరుగ్గా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ సినిమా కథ విషయంలో మొదటి పార్ట్తో పోల్చితే చాలా వీక్గా ఉంది. స్ట్రాంగ్ స్టోరీ లైన్తో ఇలాంటి మేకింగ్ చేసి ఉంటే మరో లెవల్ అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు మాత్రం విజువల్ వండర్గా అనిపించే విధంగా తీశారు. మొదటి కాంతారను మైండ్ లో పెట్టుకోకుండా ఈ సినిమాను చూస్తే తప్పకుండా ప్రేక్షకులు ఎంజాయ్ చేయవచ్చు.
ప్లస్ పాయింట్స్ :
రిషబ్ శెట్టి,
హీరోయిన్,
వీఎఫ్ఎక్స్ వర్క్,
యాక్షన్ సీన్స్,
కాంతార ప్రాంతం విజువల్స్
మైనస్ :
కథ, స్క్రీన్ ప్లే,
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్,
అనవసర కామెడీ,
చాలా సీన్స్ ల్యాగ్,
కొన్ని పాత్రలకు ప్రాధాన్యత లేకపోవడం
చివరగా...
కాస్త బోర్ అనిపించినా ఫైనల్గా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్తో ఫీల్ మారిపోతుంది.
బ్యానర్ : హంబులే ఫిల్మ్స్
నిర్మాత : విజయ్ కిరగందూర్
దర్శకత్వం : రిషబ్ శెట్టి
సంగీతం : అజనీష్ లోకనాథ్
తారాగణం : రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, రాకేష్ పూజారి, జయరామ్, గుల్షన్ దేవయ్య తదితరులు