'కన్నప్ప' రివ్యూ... భక్తి కంటే అతి ఎక్కువ

Movie Review
2.25/5
'కన్నప్ప' రివ్యూ... భక్తి కంటే అతి ఎక్కువ

Our Rating

2.25/5
2.25
out of 5

గత కొన్ని సంవత్సరాలుగా ఈ సినిమా గురించి మీడియాలో చర్చ జరుగుతోంది. అప్పట్లో కృష్ణం రాజు చేసిన సినిమా కావడంతో చాలా మంది ఆసక్తి కనబర్చుతూ వచ్చారు. మంచు విష్ణు దీన్ని తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అంటూ వచ్చాడు. దాంతో సినిమాకు హైప్‌ పెరిగింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు ఎంతో మంది స్టార్‌ కాస్ట్‌ను నటింపజేయడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

తిప్పడు(మంచు విష్ణు') చిన్నప్పుడు జరిగిన కొన్ని ఘటనల వల్ల దేవుడిని నమ్మడు. దేవుడు అంటేనే కోపంతో రగిలి పోతాడు. అలాంటి తప్పడు తనకు తెలియకుండానే అత్యంత శక్తివంతమైన వాయు లింగాన్ని కాపాడుతాడు. కాళాముఖుడు అనే అత్యంత క్రూరమైన రాక్షసుడి నుంచి వాయులింగంను కాపాడిన తిప్పడిలో భక్తిని కలిగించేందుకు స్వయంగా మహా శివుడు రుద్ర(ప్రభాస్‌)ను రంగంలోకి దించుతాడు.

తిప్పడిలో ఎలా భక్తి భావం మొదలైంది? వాయులింగంకు మహాదేవ శాస్త్రి(మోహన్‌బాబు)కు ఉన్న ప్రత్యేక అనుబంధం ఏంటి అనేది సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల నటన:

సినిమాలో గుర్తు పెట్టుకోలేనంత మంది నటీ నటులు ఉన్నారు. వారు అంతా చిన్నా చితకా వారు ఏం కాదు, ఒకప్పుడు చాలా పెద్ద నటీనటులుగా చలామని అయిన వారే. ఎంతో మంది పేర్లు కనీసం గుర్తు పెట్టుకోలేనటువంటి పాత్రలను పోషించారు. మంచు విష్ణు మొత్తం కథను తన భుజాలపై వేసుకుని నడిపించాడు. గతంలో మాదిరిగా కాకుండా ఈ సినిమాలో విష్ణు నటన కాస్త మెచ్యూర్డ్‌గా అనిపించింది. పైగా బాణాలు వేయడం మొదలుకుని యాక్షన్ సన్నివేశాల వరకు చాలా వరకు బెటర్‌గా అనిపించాడు.

హీరోయిన్‌ ప్రీతి ముకుందన్‌ అందంతో అలరించింది. భక్తి సినిమాలో అందం చూపించడం ఈమెకే చెల్లిందనే కామెంట్స్ కూడా థియేటర్‌లో వినిపిస్తాయి అది వేరే విషయం.

మోహన్‌ బాబు ఎప్పటిలాగే కాస్త అతిగానే నటించాడు. ఆయన పాత్రకు ఉన్న ప్రాముఖ్యత తక్కువే, స్క్రీన్‌ ప్రజెన్స్‌ కూడా తక్కువే అని చెప్పాలి. చాలా ఆసక్తిగా ఎదురు చూసిన ప్రభాస్ గెస్ట్‌ అప్పియరెన్స్ కూడా చాలా తక్కువ స్క్రీన్‌ టైం. ప్రభాస్‌ను ఇంకాస్త ఎక్కువ సమయం చూపించాల్సింది. మోహన్‌ లాల్‌ ఎందుకు వచ్చాడో అనేది తెలియకుండానే వెళ్లి పోతాడు. అక్షయ్‌ కుమార్‌ శివుడిగా, కాజల్‌ అగర్వాల్‌ పార్వతిగా ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో నటించిన వారు ఇలా వచ్చి అలా వెళ్లి పోయారు. వారికి నటించే స్కోప్‌ పెద్దగా దక్కలేదు.

టెక్నికల్‌ :

ఈ సినిమా ప్రధానంగా వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ హైలైట్‌గా సాగుతుంది. బాహుబలి వంటి సినిమాను చూసిన వారు ఈ సినిమాలోని వీఎఫ్‌ఎక్స్‌ ను పూర్‌ క్వాలిటీ అంటూ తీసి పడేస్తున్నారు. ఇప్పటి వరకు చాలా గ్రాఫిక్స్ ప్రధానంగా వచ్చిన సినిమాలతో పోల్చితే బాహుబలి తర్వాత ఇది బెటర్‌గానే ఉంది అనిపించినా, విష్ణు చెప్పిన స్థాయిలో మాత్రం క్వాలిటీ లేదని చెప్పాలి. ఇక దర్శకత్వం గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

కథను పార్ట్‌లు పార్ట్‌లుగా, పెద్దగా స్క్రీన్‌ ప్లే హంగామా లేదు. సినిమాటోగ్రఫీ ఒకటి బాగుంది. పచ్చని ప్రకృతిని అద్భుతంగా చూపించారు. సంగీతం గురించి ఎంత చెప్పుకున్నా ఎక్కువే అవుతుంది. బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ పరమ రొటీన్‌గా ఉంది. ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఎడిటింగ్‌లో చాలా లోపాలు ఉన్నాయి. చాలా చోట్ల జర్క్‌లు ఉన్నాయి.

విశ్లేషణ :

మంచు విష్ణు వంటి హీరో ఇలాంటి సినిమాను టేకోవర్‌ చేయడం అనేది పెద్ద తప్పుడు నిర్ణయం అనిపిస్తుంది. పైగా ఈ సినిమా కథను డీల్‌ చేయగల సత్తా ఉన్న దర్శకుడి చేతిలో ఈ సినిమాను పెట్టలేదు. పైగా ఈ సినిమాలో ఆ నటుడు, ఈ నటుడు అంటూ చాలా మందిని నటింపజేశారు. వారు ఉన్నందుకు సంతోషమే.. కానీ వారికి ప్రాధాన్యత లేకపోవడం విచారకరం.

ప్రభాస్ పాత్ర గురించి ఆహా.. ఓహో అంటూ తెగ చెప్పిన మంచు విష్ణు చివరకు ఆ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత అనేది లేకుండా చేశాడు. సినిమా మొత్తం బాధ్యత తనదే అన్నట్లుగా మంచు విష్ణు నడుచుకున్నాడు. కథనంలో కొన్ని చోట్ల అతి కనిపించింది. ముఖ్యంగా మోహన్‌ బాబు పాత్రకు అంత హైప్‌ ఇవ్వాల్సింది ఏమీ లేదు. చివరకు సింపుల్‌గా ఎండ్‌ అయింది.

సినిమా క్లైమాక్స్ మినహా, ప్రభాస్ మెరుపులు మినహా మరేం చెప్పుకోవడానికి లేదు. శివ భక్తి ఉన్న వారు సినిమాను చూడవచ్చు.

ప్లస్‌ పాయింట్స్ :

స్టార్‌ కాస్ట్‌,

ప్రభాస్‌,

భక్తి సన్నివేశాలు.

మైనస్ పాయింట్స్ :

కథనం,

పలువురు నటీనటులకు ప్రాముఖ్యత లేకపోవడం,

సంగీతం,

వీఎఫ్‌ఎక్స్‌.

చివరగా...

మంచు విష్ణు ఆ స్థాయిలో ప్రచారం చేయకుండా ఉండాల్సింది. భక్తి కంటే అతి ఎక్కువ అనిపించింది.

బ్యానర్ : 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ

నిర్మాత : మోహన్‌ బాబు, మంచు విష్ణు

దర్శకత్వం : ముఖేష్‌ కుమార్‌ సింగ్‌

సంగీతం : స్టీఫెన్ దేవస్సీ

తారాగణం : మంచు విష్ణు, ప్రీతి ముకుందన్‌, మోహన్‌ బాబు, మోహన్‌ లాల్‌, ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌, కాజల్ అగర్వాల్‌, శరత్‌ కుమార్‌, బ్రహ్మానందం, బ్రహ్మాజీ తదితరులు