'భైరవం' రివ్యూ.... యాక్షన్‌ ఎక్కువ, ఎమోషన్స్‌ తక్కువ

Movie Review
2.25/5
'భైరవం' రివ్యూ.... యాక్షన్‌ ఎక్కువ, ఎమోషన్స్‌ తక్కువ

Our Rating

2.25/5
2.25
out of 5

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో సినిమా అనగానే అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను ఆయన రూపొందించాడు. చాలా ఏళ్ల తర్వాత మంచు మనోజ్‌ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పైగా ముగ్గురు హీరోలు ఈ సినిమాలో నటించడం ద్వారా ఆసక్తి పెరిగింది. సినిమా ప్రమోషన్‌ సమయంలో తెగ హడావుడి చేసి అంచనాలు పెంచారు. మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

ఈ సినిమా కథ మొత్తం వారాహి అమ్మవారి ఆలయం, ఆ ఆలయంకు చెందిన వెయ్యి కోట్ల విలువ చేసే భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వారాహి అమ్మవారి దేవాలయం ట్రస్టీగా నాగ రత్నమ్మ(జయసుధ) వ్యవహరిస్తూ ఉంటారు. ఆమె గజపతి(మంచు మనోజ్‌), వరద(నారా రోహిత్‌), శ్రీను (బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌)లను పెంచి పెద్ద చేస్తుంది. ఆమె మరణం తర్వాత ఆలయ బాధ్యతలను వారు చూసుకోవాల్సి ఉంటుంది.

ఆలయంకు చెందిన వెయ్యి కోట్ల భూములపై మంత్రి(శరత్‌ లోహితాశ్వ) కన్ను పడుతుంది. మంత్రి నుంచి గజపతి, శ్రీను భూమిని ఎలా కాపాడారు? ఆ క్రమంలో ముగ్గురి మధ్య వచ్చే విభేదాలు ఏంటి? అనేది ఈ సినిమా కథ.

నటీనటులు :

చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్‌ ఆకట్టుకున్నాడు. గజపతి పాత్రలో ఒదిగి పోయాడు. ఎప్పటిలాగే తన మార్క్‌ యాక్షన్‌తో మెప్పించాడు. కొన్ని సన్నివేశాల్లో నటన బాగుంది. అయితే కొన్ని సన్నివేశాల్లో అనవసర యాక్షన్‌ ఉంది అనిపించింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరోసారి యాక్షన్‌ పాత్రలో మెప్పించాడు. లవ్ సీన్స్‌లో పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు. ఇతర ఇద్దరు హీరోల నడుమ బెల్లంకొండ బాబు గారి పాత్ర కాస్త తగ్గింది అనిపించింది.

ఇక నారా రోహిత్‌ పాత్రకు ఎక్కువగా ప్రాముఖ్యత ఉన్నట్లుగా అనిపించలేదు. ఉన్నంతలో పర్వాలేదు అన్నట్లుగా నటించాడు.

ఇక హీరోయిన్‌గా నటించిన అతిథి శంకర్‌ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. పాటలకు పరిమితం అయింది అనిపించింది. దివ్య పిళ్లై, ఆనంది పాత్రలు కూడా పెద్దగా లేవు. వెన్నెల కిషోర్‌ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు, జయసుధ నటనతో మెప్పించారు. ఇతర పాత్రల్లో నటించిన వారు వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.

టెక్నికల్‌ :

దర్శకుడు విజయ్‌ కనకమేడల రొటీన్‌ కథను కాస్త విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే స్క్రీన్‌ప్లేను ఇంకాస్త బెటర్‌గా ప్లాన్‌ చేయాల్సింది. దర్శకుడు విజయ్‌ కేవలం యాక్షన్‌ సన్నివేశాలపై దృష్టి పెట్టినట్లుగా అనిపించింది. సంగీతం గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంది. కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను ఎలివేట్‌ చేసే విధంగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌లో లోపాలు ఉన్నాయి. పలు సన్నివేశాలు కట్‌ కాపీ పేస్ట్‌ అన్నట్లుగా ఉన్నాయి. నిర్మాణాత్మక విలువలు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి.

విశ్లేషణ :

దేవాలయంను కాపాడటం, దేవాలయ భూములను కాపాడటం అనే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే దర్శకుడు విజయ్ కనకమేడల ఈ కథకు కొత్త స్క్రీన్‌ప్లే రాసుకున్నట్లుగా అనిపించింది. ఇది తమిళ మూవీ గరుడన్‌కి రీమేక్ అనే విషయం తెల్సిందే. తెలుగు నెటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేద్దామనే ఉద్దేశంతో చాలానే ప్రయత్నించాడు. కానీ ఎక్కువగా ప్రయత్నిస్తే మొత్తం సినిమా ఫీల్‌ మిస్‌ అవుతుందనే ఉద్దేశంతో కొంత మేరకు ఉన్నది ఉన్నట్లుగా దించేశాడు.

దర్శకుడు కథను పెద్దగా మార్చలేదు, స్క్రీన్‌ ప్లే మెయిన్‌ సీన్స్ ను మార్చలేదు. అయినా కూడా తమిళ ప్రేక్షకులను అలరించిన విధంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించడం కష్టమే. యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్న విధంగా ఎమోషన్ సీన్స్ మెప్పించలేక పోయాయి.

ప్లస్‌ పాయింట్స్ :

ముగ్గురు హీరోలు,

యాక్షన్‌ సీన్స్‌,

సెకండ్‌ హాఫ్‌

మైనస్ పాయింట్స్ :

ఎమోషన్‌ సీన్స్ లేకపోవడం,

చాలా పాత్రలకు ప్రాముఖ్యత లేకపోవడం.

చివరగా...

ముగ్గురు హీరోల యాక్షన్‌ కోసం వెళ్లవచ్చు, కానీ ఎమోషన్స్‌ను ఆశించవద్దు.

బ్యానర్ : శ్రీసత్య సాయి ఆర్ట్స్‌,

నిర్మాత : కె కె రాధామోహన్‌

దర్శకత్వం : విజయ్‌ కనకమేడల

సంగీతం : శ్రీ చరణ్‌ పాకాల

తారాగణం : మంచు మనోజ్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, నార రోహిత్‌, జయసుధ, అతిథి శంకర్‌,దివ్య పిళ్లై, ఆనంది, వెన్నెల కిషోర్‌ తదితరులు